సినిమా కష్టాలను కేసీఆర్‌కు చెప్తా.. సినీజీవులతో తలసాని - Telugu News - Mic tv
mictv telugu

సినిమా కష్టాలను కేసీఆర్‌కు చెప్తా.. సినీజీవులతో తలసాని

May 21, 2020

KCR to tell the film's misery .. Cinematography Minister Talasani Srinivas Yadav

గురువారం జూబ్లీహిల్స్లోని మెగాస్టార్చిరంజీవి నివాసంలో చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో పశుసంవర్థక శాఖ, సినీమటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చలో సినీ కార్మికుల సమస్యల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా నియంత్రణ కోసం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టాలీవుడ్ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. పరిశ్రమలోని 14వేల మంది కార్మికులకు తన సొంత నిధులతో నిత్యావసర సరుకులను అందజేస్తామని మంత్రి అన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు నిలిచిపోయి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాది మంది ఉపాది లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని  సమావేశంలో పాల్గొన్న ప్రముఖ దర్శక నిర్మాతలు మంత్రికి వివరించారు. అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని షూటింగ్‌లను నిలిపి వేశామని అన్నారు. ఈ రంగం పై ఆధారపడి జీవిస్తున్న పరిశ్రమలోని 14వేల మందికి కరోనా క్రైసిస్‌చారిటీ(సిసిసి)ద్వారా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించారు. పరిశ్రమలోని అన్నివర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని సినిమా ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ నిర్వహించుకునేందుకు సినిమా ధియేటర్‌లను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించాలని విన్నవించారు. 

అవుట్‌డోర్‌, ఇండోర్‌ షూటింగ్‌లలో ఎలాంటి లాక్‌డౌన్ జాగ్రత్తలు తీసుకుంటామో, అందుకు  సంబంధించిన మాక్‌ వీడియోను ప్రభుత్వానికి సమర్పిస్తామని చెప్పారు. వారి సమస్యలు విన్న మంత్రి తలసాని మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రభుత్వం తెలుగు చలనచ్రిత పరిశ్రమ పట్ల ఎప్పుడూ సానుకూల ధోరణితో ఉంటుంది. దేశంలోనే హైదరాబాద్‌ నగరం చిత్ర రంగానికి హబ్‌గా నిలిచింది. పోస్ట్‌ ప్రొడెక్షన్‌ చేసుకునేందుకు అనుమతించే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశాం. తప్పని సరిగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాస్క్‌లను ధరించాలి, శానిటైజర్‌ ఉపయోగించాలి. భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. మాక్‌ షూటింగ్‌ నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తాం. షూటింగ్‌ల నిర్వహణకు, ధియేటర్‌లను తెరిచేందుకు ముఖ్యమంత్రితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి తలసాని  మాటిచ్చారు. కాగా,ఈ సమావేశంలో పద్మభూషణ్‌ చిరంజీవితో పాటు సీనియర్ నటుడు నాగార్జున, నిర్మాతలు అల్లు అరవింద్‌, సి.కళ్యాణ్‌, దిల్‌రాజు, శ్యాం ప్రసాద్‌రెడ్డి, జెమిని కిరణ్‌, దర్వకులు వివి వినాయక్‌, కొరటాల శివ, ఎన్‌.శంకర్‌, త్రివిక్రమ్, ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌ రామ్మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.