మొక్కలు బతక్కుంటే ఉద్యోగాలు ఊడతాయ్.. కేసీఆర్
తెలంగాణ మెడ నిండుగా హరితహారం వెయ్యాలని సంకల్పించిన సీఎం కేసీఆర్ అధికారులకు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. మొక్కలు బతక్కపోతే ఉద్యోగాలు ఊడిపోతాయని తేల్చిచెప్పారు. గ్రామాల అభివృద్ధి అంశంపై ఆయన ఈ రోజు పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ‘ఒక్కో గ్రామానికి ఏడాదికి 7 వేల మొక్కలు మంజూరు చేస్తాం. వాటిలో 85 శాతం మొక్కలు బతకాలి. లేకపోతే ఉద్యోగాలు ఊడతాయి..’ అని అన్నారు. దీనికి సంబంధించి కలెక్టర్ల వార్షిక నివేదికలు ఇకపై తానే రాస్తానని కూడా ఆయన అన్నారు. సరిగ్గా పనిచేయని కలెక్టర్లకు నెగిటివ్ మార్కులు పడతాయని హెచ్చరించారు.
ఒక్కో గ్రామానికి ఇన్ఛార్జిలుగా మండలస్థాయి అధికారులను నియమించామని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను పచ్చని సీమలుగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో మొదటి రోజు గ్రామ సభలు నిర్వహిస్తామని, రెండో రోజు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక చేస్తామని వెల్లడించారు. ఈ నెల 6 నుంచి అన్ని గ్రామాల్లో ఈ ప్రణాళిక మొదలవుతుందని తెలిపారు. 30 రోజుల తర్వాత గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, లక్షాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తామని, లక్ష్యాలు సాధించని వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.