‘నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా. పని చేస్తా. పోదామా మరీ జాతీయ రాజకీయాల్లోకి. ఢిల్లీ దాక కొట్లాడుదామా? భారతదేశాన్ని బాగు చేద్దామా. ఎట్లా తెలంగాణను బాగు చేసుకున్నామో, అదే పద్ధతిలో బంగారు భారతదేశం కోసం పోరాడుదామా’ అని కేసీఆర్ నారాయణ్ఖేడ్ ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం నారాయణ్ఖేడ్లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. “తప్పుకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేయాలి. మనం అమెరికా పోవడం కాదు. ఇతర దేశాలే వీసాలు తీసుకొని మన దేశానికి వచ్చే పరిస్థితి చేసేంత గొప్ప సంపద, వనరులు, యువశక్తి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి నేను పోరాటానికి బయలుదేరా. బంగారు తెలంగాణను ఎలా తయారు చేసుకున్నామో.. బంగారు భారతదేశాన్ని కూడా తయారు చేసుకుందాం” అని స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఆదివారం మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ థాకరే అడుగుతున్నారు. మీరు రైతు బంధు ఇస్తున్నారట, రైతు బీమా ఇస్తున్నారట, బార్డర్ వాళ్లు తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఎట్లా ఇస్తున్నారో కాస్త చెప్పండి. మేము కూడా స్టార్ట్ చేస్తం అని అడిగారని కేసీఆర్ తెలిపారు.