ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తరగతి ఫ్లోర్లోని కంతలో కాపురం పెట్టిన ఓ విషసర్పం పాఠాలు చదువుకుంటున్న బాలికను కాటేసింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. కేరళలోని వైనాడ్లో ఈ విషాదం చోటుచేసుకుంది.
సుల్తాన్ బథేరీలో ప్రభుత్వ పాఠశాలలో షెరిన్ అనే బాలిక ఐదో తరగతి చదువుతోంది. తరగతి గదిలో గోడ పక్కన ఫ్లోర్లో రంధ్రం ఉంది. షెరిన్ నడుస్తూ పొరపాటున అందులో కాలు పెట్టింది. కాలు గుంతలోకి వెళ్లింది. బయటికి తీయగా రెండు గాట్లు కనిపించాయి. కొందరు విద్యార్థులు అవి పాము కాట్లు అని చెప్పగా, స్కూలు సిబ్బంది మాత్రం పెచ్చుల వల్ల గాయాలయ్యాయని భావించారు. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించడంలో ఆలస్యమైంది. షెరిన్ సోలి పోతుండడంతో టీచర్లు ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పారు. స్థానిక ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషయంగా ఉండడంతో కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. షెరిన్ చికత్స పొందుతూ అక్కడే చనిపోయింది. స్కూలు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఫ్లోర్ లో అంత పెద్ద రంధ్రం పడినా పూడ్చకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.