లాటరీ టిక్కెట్ల కోసం 3.5 కోట్ల ఖర్చు.. గెలుచుకున్నది రూ.5 వేలు
ఆటో డ్రైవర్ను వరించిన అదృష్టం.. అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. కేరళకు చెందిన ఆ ఆటో డ్రైవర్కు లాటరీలో రూ.25 కోట్లు తగిలాయన్నది ఆ వార్త సారాంశం. ఇది తెలియగానే అతని బంధువులు, స్నేహితులతో పాటుగా నెటిజన్లు కూడా అతన్ని అభినందించారు. చాలామంది లాటరీ టిక్కెట్లు కొంటే మన భవిష్యత్తు కూడా మారిపోతుందని భావించారు. కొంతమంది అయితే లాటరీ టిక్కెట్లు కొంటూ ఉంటే ఒక్కసారైనా బంపర్ ప్రైజ్ మనీ దక్కకపోదా.. జీవితంలో సెటిల్ అవ్వకపోమా అంటూ అనుకున్నారు. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. అలా లాటరీ టిక్కెట్ల కోసం వేలు, లక్షలు.. చివరకు కోట్లు కూడా బిచ్చగాళ్లయిన వాళ్లు లేకపోలేదు.
కేరళ రాష్ట్రంలోన ఓ వ్యక్తి తన 18 ఏళ్ల వయసులో లాటరీ కొనుగోలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటికీ ఆపలేదు. 52 ఏళ్లుగా టికెట్లు కొనుగోలు చేస్తున్నా… జీవితంలో సెటిలయ్యేంత ప్రైజ్ మనీ దక్కలేదు. ఇప్పటి వరకూ లాటరీ టికెట్లు కోసం ఖర్చు చేసిందెంతో తెలుసా.. అక్షరాల రూ.3.5 కోట్లు. వచ్చిన ప్రైజ్ మనీ రూ.5 వేలు.. ఈ 52 ఏళ్లలో అతను గెలుచుకన్న అతి పెద్ద ప్రైజ్ మనీ అదే. కేరళలోని కన్నౌర్కు చెందిన రాఘవన్… రోజుకు పది లాటరీ టికెట్ల చొప్పున తనకు వచ్చే ఆదాయంలో కొంతమొత్తాన్ని లాటరీ టికెట్ల కోసం ఖర్చు చేస్తున్నాడు. కేరళలో అత్యంత ఖరీదైన ఓనమ్ బంపర్ లాటరీని కూడా అతడు కొనుగోలు చేశాడు. ఆ టికెట్లన్నీ భద్రంగా గోనె సంచుల్లో నిల్వ చేసి అదృష్టం కోసం వేచి చూస్తూనే ఉన్నాడు. అయినా తన ప్రయత్నాలను ఆపనని తెగేసి చెబుతున్నాడు. ఎప్పటికైనా తన భర్తకు అదృష్టం కలిసి వస్తుందని రాఘవన్ భార్య శాంత ఆశాభావంతో ఉంది.