కరోనా లాక్డౌన్ సమయంలో కొందరు ఇళ్లకే పరిమితమైతే, మరికొందరు ప్రతిభావంతులు ఆ ఖాళీ సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నారు. బ్రిటన్లో స్థిరపడ్డ కేరళకు చెందిన ఓ వ్యక్తి ఏకంగా విమానాన్నే రూపొందించాడు. తయారుచేయడమే కాదు.. కుటుంబంతో కలిసి దాంట్లో పలు దేశాల్లో విహారయాత్రలు చేశాడు. కేరళలోని అలపుళకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఏవీ థామరక్షణ్ కొడుకు అశోక్ అళిసెరిల్ థామరక్షణ్ (38) బ్రిటన్లో స్థిరపడ్డాడు.
2006లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు లండన్ వెళ్లి చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఫోర్డ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొవిడ్-19 లాక్డౌన్ సమయంలో ప్రైవేట్ విమానాన్ని నిర్మించాలనే ఆలోచన అతనికి తట్టింది. సొంతంగా విమానాన్ని నిర్మించేందుకు జోహన్నెస్బర్గ్కు చెందిన ‘స్లింగ్ టీఎస్ఐ’ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీ ఫ్యాక్టరీని సంప్రదించాడు. విమానాల తయారీకి ఆ సంస్థ ఆర్డర్ చేసే కిట్లకు అదనంగా మరో కిట్ ఆర్డర్ చేసేలా ఆ సంస్థను ఒప్పించారు. అనంతరం ఆ కిట్ రాగానే తన పని ప్రారంభించాడు. దాదాపు 18నెలలు కష్టపడి నాలుగు సీట్ల విమానాన్ని సొంతంగా రూపొందించాడు. ఇందుకు దాదాపు రూ.1.8కోట్లు ఖర్చుచేశాడు.
ఈ విమానం చూస్తుంటే కొత్తబొమ్మలా అనిపిస్తున్నదని అశోక్ ఆనందం వ్యక్తంచేశాడు. కుటుంబ సభ్యులమంతా కలిసి డబ్బు ఆదా చేశామని, ఆ డబ్బుతో నాలుగు సీట్ల విమానాన్ని తయారుచేశానన్నారు. ఆ స్లింగ్ టీఎస్ఐ మోడల్ విమానానికి తన చిన్న కుమార్తె పేరు వచ్చేలా ‘జి-దియా’గా నామకరణం చేశాడు. విమానం పూర్తిగా సిద్ధయ్యాక కుటుంబంతో కలిసి ఆయన ఇప్పటివరకు యూరోప్లోని జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలకు విహరించారు. ఈ విమానం గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఖాళీ దొరికినప్పుడల్లా తమ విమానంలో మరిన్ని ప్రాంతాలను చుట్టివస్తామని అశోక్ పేర్కొన్నాడు.