తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్పై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విటర్ వేదికగా ఆగ్రహించారు. ‘కేటీఆర్… బలవంతంగా భూమిని గుంజుకోవడం, బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం. దీనిని అభివృద్ధి అంటారా? అరాచకం అంటారా?’ అని ఆయన ప్రశ్నించారు. జహీరాబాద్లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చేస్తున్న ఆందోళనపై పోలీసులు లాఠీఛార్జీలు చేసిన కథనాలను రేవంత్ రెడ్డి పోస్ట్ చేశారు.
బలవంతంగా భూమిని గుంజుకోవడం…
బక్క రైతుపై లాఠీ ఝుళిపించడం…కేటీఆర్… దీనిని అభివృద్ధి అంటారా…?!అరాచకం అంటారా!?
భూమిని త్యాగం చేసే రైతుకు లాఠీదెబ్బలు… లాభార్జనే ధ్యేయమైన వ్యాపారులకు రెడ్ కార్పెట్లా…?! pic.twitter.com/hXShvRY3kI
— Revanth Reddy (@revanth_anumula) June 23, 2022
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బుధవారం కేటీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును ప్రారంభించారు. ఈ క్రమంలో జహీరాబాద్కు కేటీఆర్ వస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని రైతులు.. నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని ఇప్పటివరకూ తగిన పరిహారం ఇవ్వలేదని ఆందోళ చేపట్టారు. పరిస్థితిని గమనించిన పోలీసులు కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటారని నిమ్జ్ భూ నిర్వసితులను వారి గ్రామాల్లోకి వెళ్లి ముందస్తుగా అరెస్టు చేశారు. కేటీఆర్ కార్యక్రమానికి వెళ్తున్న కొందరి రైతులపై లాఠీచార్జ్ చేశారు. దీనికి సంబంధించి గురువారం వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను రేవంత్ రెడ్డి ట్విట్టర్లో షేర్ చేసి, కేటీఆర్ను సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు.