ఎక్కడైనా దేవుళ్ళకు భక్తులు పాలు, పండ్లు, ఫలహారాలను నైవేద్యంగా పెట్టి తమ మనస్సులోని కోరికలను కోరుకుంటారు. లేదంటే డబ్బులు, కానుకలు హుండీలో వేస్తారు.కానీ కర్నూలు జిల్లా కోడుమూరులోని కొండమీద వెలసిన శ్రీకొండలరాయుడికి మాత్రం భక్తులు తేళ్ళను చేతులతో పట్టుకొని స్వామివారిపై వదిలి తమ మొక్కులను తీర్చుకుంటారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే మూడవ సోమవారం ఈ వింత ఆచారాన్ని కోడుమూరు ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తూ వస్తున్నారు.
విషపురుగులైన తేళ్ళను చూస్తే ఎవరైనా భయపడి పరుగులు తీస్తారు. కోడుమూరులోని కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్ళలను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్ళను ఎలాంటి జంకు బొంకు లేకుండా చేతులతో పట్టుకొని శ్రీకొండలరాయుడికి కానుకగా సమర్పించి తమ కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా నిర్భయంగా తేళ్ళను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పించడం ఇక్కడ ప్రతి యేటా కొనసాగే వింత ఆచారం.
తేలును పట్టుకునే సమయంలో కుట్టినా స్వామి వారి ఆలయం చుట్టు మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తే తగ్గిపోతుందన్నది ఇక్కడి భక్తుల నమ్మకం. ముందుగా కాలినడకన కొండెక్కుతారు తరువాత ఇలా తేళ్ళను పట్టుకుని దర్శనం చేసుకుంటారు.