చిరుత పులులకు చిక్కొచ్చిపడింది..
పులుల సంఖ్య పెరుగుతోందనే లెక్కలు సంతోషాన్ని ఇచ్చిన కొన్ని రోజుల్లోనే మరో చేదు వార్త కలవరానికి గురిచేస్తోంది. చిరుత పులులు వేగంగా అంతరిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత ఐదేళ్లలో ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లోనే ఎక్కువగా చిరుత పులులు మరణించినట్టు తాజా లెక్కలు చెబుతున్నాయి. 2018 సంవత్సరంలో 460 చిరుతలు మరణించాయని ‘వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్’ వెల్లడించింది. 2014లో దేశవ్యాప్తంగా 7,872 చిరుత పులులు ఉన్నట్టు వెల్లడించింది. అయితే వాటిలో ఒక్క ఏడాదిలోనే వందల సంఖ్యలో మరణించడం ఆందోళన కలిగిస్తోంది.
అడవులు, పచ్చదనం తగ్గిపోతుండటంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని చెబుతున్నారు. ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి వస్తుంటం వల్ల వాటిపై దాడులు పెరుగుతున్నాయన్నారు. నీటి కోసం బావుల వద్దకు వెళ్లి అందులో పడిపోవడం, విద్యుత్ వైర్లు తగలడం వల్ల దేశవ్యాప్తంగా ప్రతి ఏటా వందలాది చిరుత పులులు మరణిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. పులుల సంరక్షణ కోసం చేపట్టినట్టుగానే చిరుతల కోసం ప్రత్యేకంగా ‘ప్రాజెక్ట్ లెపర్డ్’ను ప్రారంభించాలని కోరుతున్నారు.