ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా పేరుగాడించిన ప్రశాంత్ కిశోర్.. వరుసగా ఓటములను చవిచూస్తున్నా కాంగ్రెస్ పార్టీని గెలిపించే పనిలో నిమగ్నమైయ్యారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 17 రాష్ట్రాల్లోని 358 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని సూచిస్తూ, కాంగ్రెస్ అధిష్ఠానానికి ప్రశాంత్ కిశోర్ ఇటీవలే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారట. అది ఇప్పుడు వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది.
ఈ ప్రజెంటేషన్లో.. ”తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయాలి, ఏపీలో మాత్రం జగన్ మోహన్ రెడ్డితో జతకట్టి ముందుకు వెళ్లాలి. తమిళనాడులో డీఎంకేతో, మహారాష్ట్రలో ఎన్సీపీతో, పశ్చిమ బెంగాల్లో టీఎంసీతో, ఝార్ఖండ్లో జేఎంఎంతో వెళ్లడం మంచిది. జమ్మూ కశ్మీర్లో నేషన్ కాన్ఫరెన్స్తో, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడి భాగస్వామ్య పక్షాలతో కలిసి వెళ్లడం మేలు” అని ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించారట.
అంతేకాకుండా, రెండో ప్రతిపాదనలో సోనియాను యూపీఏ చైర్పర్సన్గా ఎన్నుకుని, గాంధీయేతర కుటుంబానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించడం మంచిదని, రాహుల్ను పార్లమెంటరీ బోర్డు నాయకుడిగా చేయడం వల్ల చట్ట సభలో ప్రధాని వర్సెస్ రాహుల్గా మారుతుందని, ఫలితంగా పార్లమెంటు లోపల, వెలుపల ప్రజల గొంతును వినిపించేందుకు వీలవుతుందని పీకే సూచించారట.