LIC పాలసీదారులకు గుడ్ న్యూస్.. రద్దయిన పాలసీలపై కీలక నిర్ణయం
ప్రసిద్ధ బీమా సంస్థ.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రీమియం చెల్లించకపోవడం కారణంగా రద్దయిన పాలసీల పునరుద్ధరణపై కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా పాలసీలను మళ్లీ పునరుద్ధరించుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ల్యాప్స్ అయిన పాలసీలను రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది ఎల్ఐసీ. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ స్పెషల్ డ్రైవ్ ఆగస్టు 17వ తేదీ నుంచి అక్టోబర్ 21 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది.
ఈ ‘స్పెషల్ రివైవల్ క్యాంపెయిన్’లో అన్ని నాన్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ (యులిప్) పాలసీలను రాయితీతో ఆలస్య రుసుము చెల్లించి కొనసాగించుకోవచ్చని ఎల్ఐసీ ఈ సందర్భంగా వెల్లడించింది. ప్రీమియం మొత్తం చెల్లించని తేదీ నుంచి నుంచి ఐదేళ్లలోపు పాలసీలను రెన్యూవల్ చేసుకోవచ్చని పేర్కొంది. రూ. లక్ష వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే.. అప్పుడు లేట్ ఫీజుపై 25 శాతం తగ్గింపు ఉంటుంది. గరిష్టంగా రూ. 2500 వరకు తగ్గింపు అందిస్తోంది. రూ. 1,00,001 నుంచి రూ. 3 లక్షల వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటే కూడా ఆలస్య రుసుములో 25 శాతం తగ్గింపు వస్తుంది. అయితే.. గరిష్టంగా రూ. 3 వేల వరకు తగ్గింపు ఉంటుంది. రూ. 3,00,001 లేదా ఆపై ప్రీమియం చెల్లించాల్సిన పాలసీలకు ఆలస్య రుసుములో 30 శాతం తగ్గింపు ఉంటుంది. అయితే.. గరిష్టంగా రూ. 3500 వరకు తగ్గింపు ఉంటుందని ఎల్ఐసీ వెల్లడించింది.
మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలు అయితే 100 శాతం లేట్ ఫీజు ఉండదని ఎల్ఐసీ తెలిపింది. వివిధ కారణాలతో, ఆర్థిక ఇబ్బందులతో ప్రిమియం చెల్లించని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పాలసీలను పునరుద్ధరించుకోవాలని సూచించింది.