ఆంధ్రప్రదేశ్లో ఓ రెండు గ్రామాలు మూఢ నమ్మకాలతో తమ తమ గ్రామాలలో స్వీయ లాక్డౌన్ విధించుకున్న సంఘటన ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కరోనా కారణంగా ఆంక్షలు, లాక్డౌన్ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన విషయం తెలిసిందే. కానీ, ఇంకా మూఢ నమ్మకాలతో సహజీవనం చేస్తున్న పలువురు తమకు తామే లాక్డౌన్ విధించుకోవటం కలకలం రేపుతుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సరిబుజ్జిలిలో గ్రామస్థులు మూఢ నమ్మకాలతో వారికి వారే స్వీయ లాక్డౌన్ విధించుకున్నారు. దుష్ట శక్తులు ఉన్నాయని గ్రామం చుట్టూ ముళ్ల కంచెలు వేసుకున్నారు. గ్రామస్థులు ఎవరూ బయటకు వెళ్లకుండా, బయటి వ్యక్తులు గ్రామంలోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
మరోవైపు ఇదే జిల్లాకు చెందిన మరో గ్రామం వెన్నెలవలసలో గ్రామస్థులు మూఢ నమ్మకాలతో క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఈనెల 25 వరకు గ్రామంలోకి ఎవరూ రాకూడదని ఆంక్షలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు తాళాలు వేసేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు రెండు గ్రామాలకు చేరుకుని వాస్తవ పరిస్థితిని వివరించేయత్నం చేస్తున్నారు. ఈ రెండు గ్రామాలు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.