రైల్వేశాఖకు చెందిన భూమిని ఆక్రమించారని దేవుడికే నోటీసులిచ్చారు అధికారులు. వారం రోజుల్లో స్థలాన్ని ఖాళీ చేయాలని అందులో తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. మొరెనా జిల్లాలో సబల్గర్ ప్రాంతంలో రైల్వే బ్రాడ్గేజ్ పనులు జరుగుతున్నాయి. హనుమంతుడి ఆలయం ఉన్న ప్రాంతం రైల్వేదని గుర్తించిన అధికారులు వెంటనే దానిని తొలగించాలంటూ ఆంజనేయుడికి నోటీసులు జారీ చేశారు. దాని కూల్చివేత, ఆ స్థలం పునరుద్ధరణకు అయ్యే ఖర్చును సైతం మీ నుంచే వసూలు చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఝాన్సీ రైల్వే డివిజన్ అధికారులు జారీ చేసిన వింత నోటీసు పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
దీనిపై ఝాన్సీ రైల్వే డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మనోజ్ మాథుర్ మాట్లాడుతూ.. హనుమంతుడి పేరు మీద తమ అధికారులు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఫిబ్రవరి 8న ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ఈ నోటీసులు జారీచేసినట్లు చెప్పారు. వాస్తవానికి ఆలయ యజమానికి నోటీసు ఇవ్వాలి కానీ చిన్న పొరపాటు వల్ల హనుమంతుడికి అధికారులు నోటీసులు ఇచ్చారని తెలిపారు.