ఫోన్ పోతే మాకు కాల్ చేయండి.. కేంద్రం హెల్ప్లైన్
రద్దీగా వున్న బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలు చేసినప్పుడు దొంగల చేతికి బాగా పని దొరుకుంతుంది. ఇదివరకు పర్సులే పోయేవి. ఇప్పుడు దొంగలు కూడా అప్డేట్ అయ్యారు. పర్సుతో పాటు ఫోన్లనుకూడా తస్కరిస్తున్నారు. ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు పెరగడంతో పర్సులు పెట్టుకోవడాన్ని కొందరు మానేశారు. స్మార్ట్ఫోన్లు మాత్రం తప్పకుండా అందరూ వాడుతున్నారు. సో, దొంగలకు ఫోన్ కొట్టేసినా లాభమే. దాన్ని ఓఎల్ఎక్స్లోనో, జగదీశ్ మార్కెట్లలో అమ్ముకుని క్యాష్ చేసుకుంటారు. పాపం ఫోన్ పోగొట్టుకున్నవారి ముఖం మాడిపోయిన దోశ మాదిరి అయిపోతుంది. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్లు దానిని మరిచిపో అని చాలా సింపుల్గా చెప్పేస్తారు. దీంతో ఫోన్ పోగొట్టుకున్నవాళ్ల బాధ మాటల్లో వర్ణణాతీతం.
అయితే ఇకపై అలాంటివి కుదరవు. అలాంటి బాధపడటాలకు, దొంగల పని పట్టడానికి ఓ సరికొత్త టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోంది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సహకారంతో పైలట్ ప్రాజెక్టుగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల ఫిర్యాదు కోసం కేంద్ర కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ www.ceir.gov.in అనే వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఇఐఆర్) పేరుతో మహారాష్ట్రలో పైలట్ ప్రాజెక్టుగా, బీఎస్ఎన్ఎల్ సహకారంతో దీన్ని ప్రారంభించారు.
మొబైల్ భద్రత, దొంగతనం, ఇతర సమస్యలను పరిష్కరించడానికి మొబైల్ ఫోన్ల, రీప్రోగ్రామింగ్తో సహా టెలీ కమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) దీనిని చేపట్టింది. ఫోన్ పోగొట్టుకున్నా, ఎవరైనా కొట్టేసినా.. దానిని అన్ని నెట్వర్క్లలో బ్లాక్ చేయడం, నకిలీ మొబైల్ పరికరాల ఉపయోగాన్ని నిరోధించడం, మొబైల్ ఫోన్లలో కీలకమైన నకిలీ ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎంఈఐ)నిరోధించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యాలు. ఇది సీఈఐఆర్ గ్లోబల్ ఐఎమ్ఈఐ డేటాబేస్కు అనుసంధానమై ఉంటుంది. దీని ద్వారా డేటాబేస్లో ఉన్న ఇతర ఐఎంఈఐ సంఖ్యలతో పోల్చి నకిలీ హ్యాండ్సెట్లను గుర్తించడానికి అనుమతి ఇస్తుంది. దీనికి బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, ఐడియా, ఎయిర్టెల్, వొడాఫోన్ తదితర మొబైల్ సర్వీస్ ప్రొవైడర్స్ డాట్కు సహకరిస్తాయి.
ఎలా ఫిర్యాదు చేయాలి..
ఫోన్ పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆపై 14422 హెల్ప్లైన్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్ డాట్కు సమాచారం అందించాలి. దీంతో డాట్ వెంటనే పని ప్రారంభిస్తుంది. ముందుగా పోయిన ఫోన్ను బ్లాక్ చేస్తుంది. తద్వారా దొంగిలించిన వ్యక్తి లేదా మహిళ ఆ పరికరాన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తే వెంటనే గుర్తిస్తుంది. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించడం కుదరదు.