ఒకరితో నిశ్చితార్ధం చేసుకొని, మరొక యువతిని ప్రేమించి.. వారితో ఇద్దరు పిల్లలను కన్న తర్వాత ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాడో వ్యక్తి. ఇందుకు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా అంగీకరించడం గమనార్హం. ఈ అరుదైన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో చోటుచేసుకుంది. కేశ్కాల్ ప్రాంతంలోని ఉమ్లా గ్రామానికి చెందిన రంజన్ సింగ్ సలామ్కు ఆండేగా గ్రామానికి చెందిన దుర్గేశ్వరీ మార్కమ్ అనే యువతితో ముందుగా నిశ్చితార్థం అయింది. ఆ తర్వాత దుర్గేశ్వరి.. రంజన్ సింగ్ ఇంటికి వచ్చి అక్కడే ఉండసాగింది. పెళ్లి కాకముందే.. అతడి ఇంటికి వచ్చి ఉండటం తీవ్ర చర్చకు దారితీసింది. కొద్ది నెలల తర్వాత ఆమె ఓ ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఆ తర్వాత కొద్ది రోజులకు అంవరీ గ్రామానికి చెందిన సన్నో బాయి గోటా అనే యువతిని రంజన్ ప్రేమించాడు. ఈ క్రమంలోనే సన్నో కూడా గర్భం దాల్చింది. ఆమె సైతం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు రంజన్ సింగ్ కుటుంబంతో మాట్లాడారు. గ్రామంలో పంచాయితీ సైతం నిర్వహించారు. ఇద్దరు యువతులు రంజన్ సింగ్ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించారు. అందుకు పెద్దలు సైతం ఒప్పుకోవడంతో ఒకే వేదికపై ఈ నెల 8న రంజన్ సింగ్ ఇద్దరినీ వివాహం చేసుకున్నాడు.