నిండు గర్భంతో 100 కి.మీ నడక..అయినా దక్కని శిశువు
లాక్డౌన్ కారణంగా ఎక్కడి వలస కూలీలు అక్కడే ఉండిపోయిన సంగతి తెల్సిందే. దీంతో ప్రభుత్వం వాళ్ళను తరలించడానికి శ్రామిక్ స్పెషల్ రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే, వాటిలో కూడా రిజర్వేషన్ దొరక్క కొందరు వలస కూలీలు కాలినడకనే సొంతూళ్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో 17మంది వలస కూలీలు రైలు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. తాజాగా ఓ మహిళ సొంతూరుకు వెళ్ళడానికి నిండు గర్భంతో 100కిమీలకు పైగా నడిచింది. మార్గమధ్యలో ఆడబిడ్డకు జన్మనివ్వగా పుట్టిన కాసేపటికే శిశువు మరణించింది. తొలి సంతానం కావడంతో ఆ దంపతుల బాధ వర్ణనాతీతంగా మారింది.
బిహార్కు చెందిన జతిన్ రామ్, బిందియా దంపతులు పంజాబ్లోని లుథియానాలో కూలీలుగా పనిచేస్తున్నారు. లాక్డౌన్ కారణంగా గతవారం బిహార్లోని సొంతూరుకు వెళ్లాలనుకున్నారు. శ్రామిక్ రైళ్లలో రిజర్వేషన్ దొరకకపోవడంతో నడక మొదలెట్టారు. నడుస్తూ నడుస్తూ హరియాణాలోని అంబాలా చేరుకోగానే బిందియాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. పోలీసుల సాయంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించగా పాప పుట్టింది. అయితే, కాసేపటికే శిశువు మృతిచెందింది. దీంతో ఆ చిన్నారికి అంబాలాలోనే అంత్యక్రియలు నిర్వహించారు. తరువాత స్థానిక సంక్షేమ సంస్థ ఒకటి వారికి ఆహారం, వసతి కల్పించింది. శ్రామిక్ రైల్లో సొంతూరుకు వెళ్లేలా ఏర్పాటు చేసింది.