నాయకులపై ప్రేమాభిమానాలతో అభిమానులు నానా పనులూ చేస్తుంటారు. కొందరు రక్తదానం చేస్తే, ఇంకొందరు పాలాభిషేకం చేస్తారు. మరికొందరు వారి పేరుతో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడతారు.. ఇవన్నీ అభిమాన నాయకుల పుట్టిన రోజున ఎక్కువగా చేస్తుంటారు. కొంతమంది తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్కుప్రేమతో గుడి కూడా కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ముందస్తు ఎన్నికల సందర్భంగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన అభిమాన నేతయిన మంత్రి హరీశ్ రావుపై ప్రేమతో సిద్దిపేటకు చెందిన కొత్వాల్ శ్రీనివాస్ తన సెలూన్లో అందరికి ఉచితంగా సేవలు చేస్తున్నాడు. వచ్చే ఎన్నికల్లో హరీశ్రావు అత్యధిక మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాడు.
ఈ ఉచిత సేవను బుధవారం ప్రారంభించాడు. అంతేకాదు సెలూన్ షాపు ఎదుట హరీశ్ అన్నకే మన ఓటు.. కారు గుర్తుకే మన ఓటు అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి పక్కనే ఉచితంగా హేయిర్ కటింగ్, షేవింగ్ చేస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ ఉచిత సేవలు కొనసాగుతాయని తెలిపాడు. ఇలా ఎన్నికలు పూర్తై.. ఫలితాలు వచ్చే వరకు చేస్తనని శ్రీనివాస్ పేర్కొంటున్నాడు. మంత్రి హరీశ్రావు నాయీబ్రాహ్మణులకు ఎంతో మేలు చేశాడని, అందుకే తనవంతుగా ఈ కార్యక్రమం చేస్తున్నానని పేర్కొన్నాడు.