ఖమ్మం వచ్చినప్పుడల్లా కొన్ని నేర్చుకొని పోతున్నా….అది ముమ్మాటికి నిజం అని వ్యాఖ్యానించారు మంత్రి హరీష్ రావు. ఖమ్మం నగరంలోని లకారం పార్క్ , డివైడర్, చెట్లు అన్నీ ఫోటోలు తీసుకొని నేను నా ప్రాంతాన్ని అలానే అభివృద్ధి చేసుకున్నానని, పాత ఖమ్మంకు ఇప్పటి ఖమ్మంకు పోలికే లేదన్నారు. సోమవారం ఖమ్మం జిల్లాలో పర్యటించిన మంత్రి.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 18న(బుధవారం) ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగబోతున్న నేపథ్యంలో.. ఖమ్మంలో జరగబోయే సభ చారిత్రక సభ అని.. దేశ రాజకీయాలను మలుపు తిప్పే సభ అని అన్నారు. వంద ఎకరాల్లో ఈ బహిరంగ సభ జరుగుతుందని.. కేవలం పార్కింగ్ కోసమే 448 ఎకరాల్లో 20 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని చెప్పారు. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లు సభలో అందుబాటులో ఉంటారని చెప్పారు.
నియోజక వర్గాల వారీగా ఇన్ చార్జ్లను నియమించి జన సమీకరణ చేస్తున్నామని చెప్పారు హరీశ్ రావు. 13 నియోజకవర్గాల నుంచి ఎక్కువ జన సమీకరణ చేస్తున్నామన్నారు. ఈ సభకు ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. సభకు వాహనాలు దొరకడం కష్టంగా మారడంతో.. పక్క రాష్ట్రాల నుంచి బస్సులు,వాహనాలు సమకూరుస్తున్నామని చెప్పారు. వేదికపై ముఖ్య అతిధులతో పాటు ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు, నేతలు కూడా వేదికపై ఉంటారని చెప్పారు. రేపు రాత్రికి ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు హైదరాబాద్ చేరుకుంటారని తెలిపారు. కళా కారులకు ప్రత్యేక వేదిక ఉంటుందని.. రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు హరీశ్ రావు.
ఎల్లుండి జరగబోయే సభకు సీఎం షెడ్యూల్ ఇదే..
“ఎల్లుండి 18 న ఉదయం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్తో ముగ్గురు ముఖ్య మంత్రులు, జాతీయ నేతలు చర్చలు జరుపుతారు. యాదాద్రి దర్శనం చేసుకొని.. రెండు హెలి కాప్టర్లలో ఖమ్మం చేరుకుంటారు. నూతన కలెక్టరేట్ ప్రారంభం తర్వాత ఖమ్మం కలెక్టరేట్ లో రెండవ విడత కంటి వెలుగు ప్రారంభిస్తారు. కంటి వెలుగు ప్రారంభం తర్వాత కలెక్టరేట్ లో నలుగురు ముఖ్యమత్రులు భోజనం చేస్తారు.సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది” అని హరీశ్ రావు తెలిపారు.