ఇదే రిపీట్ అవుద్ది.. మర్చిపోకండి
రాష్ట్రంలో ఐటీ, ఈడీ దాడులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… బీజేపీ దేశ వ్యాప్తంగా దాడులు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. ఈ దాడులను ముందే ఊహించామని, సీఎం కేసీఆర్ ముందే చెప్పారని గుర్తు చేశారు. తాటాకు, బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దాడులను ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసని అన్నారు. ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలని, ఇలా టార్గెట్ చేసి దాడులు చేయడం సరికాదన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి విధానాలను ఎప్పుడూ చూడలేదన్నారు.
‘‘అధికారం శాశ్వతం కాదు.. ఈ రోజు వ్యవస్థలు మీచేతుల్లో ఉండొచ్చు.. రేపు మా చేతుల్లో ఉండవచ్చు. ఇవ్వాళ మీరు ఉన్నారు.. రేపు మారినప్పుడు ఈ సంప్రదాయం కొనసాగుతుందని మర్చిపోవద్దు’’ అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఇలాంటి దాడులకు టీఆర్ఎస్ నాయకత్వం భయపడదని స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలను ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తామని, ప్రజలను చైతన్యం చేసి ఏంటనేది వ్యవస్థలకు చూపిస్తామన్నారు. తామేంటో.. ఏం జరుగుతుందో భవిష్యత్లో చూస్తారన్నారు మంత్రి. ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహిస్తామని, 15 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించనున్నట్లు తెలిపారు.