సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. మొదట హత్యగా ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చిన పోలీసులు.. వేగంగా స్పందించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో 24 గంటల్లోనే కేసును ఛేదించారు. సోమవారం ఉదయం 6 గంటలకు మార్నింగ్ వాకింగ్ కోసం తన గ్రామం గుర్జకుంట క్రాస్రోడ్డు వైపు వెళ్లారు మల్లేశం. ఈ క్రమంలో మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేయగా తలకు తీవ్ర గాయం కావడంతో కిందపడిపోయారు. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రంగంలోకి దిగిన సిద్ధిపేట పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ ప్రారంభించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత.. హంతకులను పట్టుకునేందుకు హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన ఈ బృందం అనుమానితులపై దృష్టి సారించింది. మల్లేశం స్వగ్రామం గుర్జకుంట ఉప సర్పంచ్ సత్యనారాయణతో గత కొంతకాలంగా వివాదాలు నెలకొన్నట్లు పోలీసులు గుర్తించారు. అతనిని, అతని ముఖ్య అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మద్దూర్ పోలీస్ స్టేషన్లో ప్రశ్నించగా.. నేరం అంగీకరించడంతో పాటు హత్యకు ఉపయోగించిన ఆయుధాలు దాచిన వివరాలు సైతం వెల్లడించినట్లు తెలుస్తోంది. నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హత్యకు ఉపయోగించిన వేటకొడవళ్లు వంటి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లేశం మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసి స్వగ్రామం గుర్జకుంటకు తరలించారు. ఇవాళ మల్లేశం అంత్యక్రియలు జరగనున్నాయి. మరోవైపు నిందితులను పోలీసులు మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు.