కేఎంసీ వైద్య విద్యార్థి ప్రీతి ఆదివారం మరణించింది.ఐదు రోజల పాటు చావుతో పోరాడి చివరికి ఓడిపోయింది. సీనియర్ సైఫ్ వేధింపులకు తాళలేక ప్రీతి పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది. మొదట ఆమెకు వరంగల్లో చికిత్స అందించి తర్వాత నిమ్స్కు తరలించారు. ప్రీతిని రక్షించేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రీతి మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులు గుండెలో పగిలేలా రోదిస్తున్నారు. ప్రీతి తల్లిదండ్రులను పలువురు శ్రేయోభిలాషులు, రాజకీయ ప్రముఖకులు ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె కుటుంబానికి తెలంగాణ సర్కార్ రూ.30 లక్షల పరిహారంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చింది.
డాక్టర్ ప్రీతి తల్లితండ్రులకు నా లేఖ pic.twitter.com/SsIQimvQdP
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 28, 2023
తాజాగా ప్రీతి తల్లిదండ్రులకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓ లేఖ రాశారు. “గౌరవనీయులైన నరేందర్-శారద గారికి… సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఒక తల్లిగా తాను ఎంతో వేదనకు గురయ్యాను. ప్రీతి కోలుకోవాలంటూ గత మూడ్రోజులుగా కోరుకున్న కోట్లాదిమందిలో నేను కూడా ఒకరిని. ఎన్నో కష్టాలకు ఓర్చి పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న ప్రీతికి ఇలా జరగడం జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక ఉత్తమ వైద్యురాలిని సమాజం కోల్పోయింది. ఈ సందర్భంగా కడుపుకోత అనుభవిస్తున్న మీకు ఎంత ఓదార్పు ఇవ్వాలని ప్రయత్నం చేసినా అది చాలా తక్కువే అవుతుంది. ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడని పరిస్థితి ఇది.మీ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రీతి మరణానికి కారణమైన వారిని రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టబోదని మీకు హామీ ఇస్తున్నాను. ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుంది. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను” అంటూ కవిత తన లేఖలో పేర్కొన్నారు.