హైదరాబాద్లో ఉన్న వాతావరణ శాఖ నేడు తెలంగాణలోని పలు జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన ప్రాంతాల్లో ఎండలు మండిపోతాయని, కోస్తాంధ్రపై 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డ కారణంగా బీహార్ నుంచి చత్తీస్గఢ్, తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలులతో 1,500 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. ఈ కారణంగా తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
”నిన్న కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మహబూబ్నగర్లో అత్యధికంగా 2.2 సెంటీమీటర్ల వర్షపాతం. ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో అత్యధికంగా 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక బంగాళాఖాతంలో అండమాన్ దీవులకు సమీపంలో నేడు నైరుతి రుతుపవనాల కదలికలు మొదలు కానున్నాయి. ఈ నెలాఖరు నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి” అని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.