బాలీవుడ్లో వచ్చిన సంచలన చిత్రం ద కశ్మీర్ ఫైల్స్. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో చిన్న చిత్రంగా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా వల్ల ఓ స్కూలు పేరు మార్చారు. వివరాలు.. దేశ రాజధాని ఢిల్లీలో టీకా లాల్ తాప్లూ అనే కశ్మీరీ పండిట్ పేరుతో ఓ స్కూలు ఉంది. కశ్మీర్లో చోటుచేసుకున్న దురాగతంలో ఆయన అమరుడయ్యాడని సినిమాలో చూపించారు. దీంతో ఆయన గౌరవార్థం స్కూలు పేరును ‘ షహీద్ టీకాలాల్ తాప్లూ’గా మార్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాప్లూ బీజేపీ సభ్యుడు, జమ్ము కశ్మీర్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారని వెల్లడించారు. దేశ భక్తుడు, పండిట్లకు గొప్ప నాయకుడని కొనియాడారు. దేశ విభజన తర్వాత కశ్మీరీ పండిట్లపై జరిగిన దాడులపై పరిశోధన జరగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ద కశ్మీర్ ఫైల్స్ చిత్రం ద్వారా దేశ ప్రజలకు ఓ అవగాహన వచ్చిందని పేర్కొన్నారు.