శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ మరికొన్ని నెలల్లో విడుదలు కాబోతున్నాడు. ఇంతలో అనూహ్యంగా ఆ ఖైదీ జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో జైలులో తీవ్ర కలకలం రేగింది. అయితే చనిపోయిన ఖైదీ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా అతని కడుపులో సూసైడ్ నోట్ లభించింది. దీంతో మరింత కలకలం రేగింది. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్ సెంట్రల్ జైలులో గురువారం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన అస్గర్ అలీ మన్సూరీ(31) ఓ హత్యా నేరంలో నాసిక్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. శిక్ష అనుభవించిన అతడు మరి కొన్ని నెలల్లో విడుదల కాబోతున్నాడు. అయితే అక్టోబర్ 7న జైలు గదిలో అస్గర్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
దీంతో అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా.. అతడి కడుపులో ఓ సూసైడ్ నోట్ బయటపడింది. పాలిథిన్ కవర్లో చుట్టిన ఆ సూసైడ్ నోట్లో తన చావుకు గల కారణాలను రాసుకొచ్చాడు మృతుడు. తన ఆత్మహత్యకు జైలు సిబ్బంది వేధింపులే కారణం అని అతను స్పష్టంగా లేఖలో పేర్కొన్నాడు. ఈ సంఘటనపై స్పందించిన అధికారులు విచారణకు ఆదేశించారు. చదవటం, రాయటం రాని అస్గర్ వేరే వ్యక్తి సహాయంతో ఆ సూసైడ్ నోట్ రాయించుకుని ఉంటాడని భావిస్తున్నారు. కాగా, కొద్దిరోజుల క్రితం జైలు నుంచి విడుదలైన మరి కొంతమంది ఖైదీలు కూడా జైలు సిబ్బంది వేధింపులపై అధికారులు, ముంబై హైకోర్టుకు లేఖ రాశారు.