ప్రపంచ దేశాలను రెండు సంవత్సరాలపాటు గడగడలాడించి, అల్లకల్లోలం చేసి, కోట్ల మందిని బలితీసుకున్న కరోనా మహమ్మారి.. చైనా దేశంలో మళ్లీ విజృంభిస్తుంది. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. చైనాకు చెందిన ఈశాన్య నగరం చాంగ్ చున్లో కరోనా కొత్త వేరియంట్ బయటపడిందని, ఈ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో చాంగ్ చున్లో చైనా ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ను విధించింది. అంతేకాకుండా లాక్డౌన్లో కఠిన ఆంక్షలను అమలు చేసింది. కరోనా వైరస్ నుంచి ఎలాగోలా బయటపడిపోయామంటూ ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇటువంటి సమయంలో కరోనా మళ్లీ విజృంభిస్తుండటం కలకలం రేపుతుంది.
ఈ కొత్త వేరియంట్కు సంబంధించిన వివరాలను అక్కడి వైద్యులు వెల్లడించారు. ’90 లక్షల జనాభా ఉన్న నగరంలో కొత్త వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తోంది’. కావున స్థానికులు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావొద్దని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రమే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లాలని సూచించారు. అది కూడా రెండు రోజులకు ఒకసారి మాత్రమే బయటకు రావాలని కఠిన ఆంక్షలు విధించింది. నగరంలోని ప్రతి ఒక్కరూ మూడు సార్లు కరోనా పరీక్షలను చేయించుకోవాలని అధికారులు సూచించారు. అత్యవసరం కాని సేవలను రద్దు చేశారు. ట్రాన్స్పోర్ట్ లింకులను కూడా మూసివేశారు.
మరోపక్క రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య రెండు వారాలుగా భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది. అక్కడి ప్రజల జనజీవనం ఎప్పుడు మెరుగుపడుతుందని యావత్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా పలు దేశాల అధ్యక్షులు యుద్ధాన్ని ఆపాలని రెండు దేశాల అధ్యక్షులను వేడుకుంటున్నారు.