జరిమానా కట్టమంటే బైక్ తగలబెట్టాడు..!
కొత్త ట్రాఫిక్ రూల్స్ వచ్చిన తర్వాత జరిమానా కట్టేందుకు వాహనదారులు భయపడిపోతున్నారు. భారీ జరిమానా కట్టలేక విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. కొంత మంది రోడ్లపైనే వాహనాలు వదిలి వెళ్తుంటే మరి కొంత మంది జైలుకైనా వెళ్తాం కానీ ఫైన్ కట్టలేమని తెగేసి చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఓ వ్యక్తి ఫైన్ కట్టమన్నందుకు తన బైక్కు నిప్పుపెట్టేశాడు. అంతా చూస్తుండగానే నిమిషాల్లో ఆ బైక్ పూర్తిగా కాలిపోయింది.
సరాయి ఫేజ్-1లో రాకేశ్ అనే వ్యక్తి మద్యం తాగి బైక్ నడుపుతూ పోలీసులకు చిక్కాడు. దీంతోపాటు అతని వద్ద ఎటువంటి పత్రాలు లేకపోవడంతో ఫైన్ విధించి కట్టాలని కోరారు పోలీసులు. అంత జరిమానా కట్టలేనని రాకేశ్ బైక్ పెట్రోల్ పైపు లాగి నిప్పు పెట్టాడు. వెంటనే దానికి మంటలు వ్యాపించి కాలిపోయింది. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు నీళ్లు చల్లినప్పటికీ లాభం లేదు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.