మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం రోజు రోజుకూ మరింత క్షీణిస్తోంది. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని.. వెంటిలేటర్, ఎక్మోపై చికిత్స కొనసాగుతోందని తెలిపారు. కిడ్నీలు ఫెయిలవ్వడంతో డయాలసిస్ (సీఆర్ఆర్టీ) చేస్తున్నట్లు చెప్పారు. నిపుణులైన వైద్య బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ప్రముఖులు ఎందరో ప్రీతిని పరామర్శించి ఆమె పేరెంట్స్ కు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. నిమ్స్ ఆస్పత్రి స్పెషలిస్ట్ డాక్టర్లు, మల్టీ డిసిప్లినరీ బృందం ఆమెకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
మరోవైపు ప్రీతి ఇప్పటివరకు ఆరు సార్లు ఆగిపోయింది. ఎంజీఎంలో ఒకసారి గుండె ఆగిపోగా, నిమ్స్ లో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదుసార్లు గుండె ఆగిపోయింది. వైద్యులు వెంటనే అలర్టై సీపీఆర్ చేయడంతో పెద్ద గండం తప్పింది. గత ఐదు రోజులుగా ఆర్సీయూ, వెంటిలేటర్, ఎక్మో యంత్రం సాయంతో ప్రత్యేక వైద్య బృందం చికిత్స చేస్తోంది. ఇదిలా ఉండగా ప్రీతి తండ్రి నరేందర్ తమ కూతురిది ఆత్మహత్య యత్నం కాదని.. హత్య చేయాలని చూశారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రీతి మాట్లాడిన ఆడియోలు వింటే.. ఆమెను ఎంతగా వేధించారో అర్ధమవుతుందని అన్నారు. తమతో ప్రీతి మాట్లాడిన తర్వాత హత్యాయత్నం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. తనతో ఫోన్ మాట్లాడే సమయంలో కూడా ప్రీతి భయపడుతూనే ఉందని చెప్పారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.