కరోనా వైరస్ను నిరోధించేందుకు భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకాపై హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ జరగుతున్న విషయం తెలిసిందే. నిన్న ఇద్దరు వలంటీర్లకు ఈ టీకా వేశారు. తర్వాత 24 గంటల పాటు వారిని ఆస్పత్రిలోనే ఉంచి పరీక్షించారు. ప్రస్తుతానికి ఎలాంటి దుష్ర్ర్పభావాలూ లేకపోవడంతో ఇంటికి పంపారు. వారి ఆరోగ్యాన్ని 14 రోజలు పాటు పరీక్షించి ఫలితాలు నమోదు చేస్తారు. టీకాలోని క్రియారహిత వైరస్ వల్ల శరీరంలో యాంటీబాడీలు ఎంతమేరకు పెరిగాయో పరీక్షిస్తారు. తర్వాత రెండో దశ ట్రయల్స్ మొదలవుతాయి.
ప్రస్తుతం వారిలో నొప్పులు, మంటలు, అలర్జీలు, అవయాలపై దుష్ప్రభావం లాంటివి లేవని వైద్యులు చెప్పారు. ఐసీఎంఆర్ రూపొందించిన ప్రోటోకాల్ ప్రకారం రెండో దశ ప్రయోగాలు నిర్వహిస్తామన్నారు. క్లినికల్ ట్రయల్స్ కోసం తమ వద్ద 35 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, దేశవ్యాప్తంగా 12 వైద్య కేంద్రాల్లో మొత్తం 60 మంది వాలంటీర్లను ఎంపిక చేశారని వెల్లడించారు. కాగా, ఆక్స్ఫర్డ్ వర్సిటీ పరిశోధకులు రూపొందించిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వలంటీర్లపై ప్రయోగించగా రోగనిరోధక శక్తి పెరిగింది. 1,077 మందిపైకి ఈ టీకాను ఇవ్వగా వారిలో యాంటీబాడీస్ పెరిగాయి. కరోనా వైరస్ను అడ్డుకునే తెల్ల రక్తకణలు కూడా బాగా ఉత్పత్తి అయ్యాయి. పెద్దగా దుష్పరిణామాలు కూడా కనిపించలేదు. చాలామందికి జ్వరం, తలనొప్పి వచ్చినా పారాసిటమాల్తో తగ్గిపోయాయి.