NTR శత జయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్ నివాళి
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నూరవ జయంతి నేడు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మనవడు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి రామకృష్ణ తదితరులు నివాళులర్పించారు.
నివాళులు అర్పించిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఎల్లప్పుడూ సజీవంగా ఉంటారు. అయన ఒక మహానుభావుడు, ఇలా అందరూ అనిపించుకోలేరు. ఆయన మహోన్నత వ్యక్తి. ఎన్నో క్లిష్ట పరిస్థితిలో నిలబడి విజయాలు సాధించారు. ఎవ్వరూ చేయని పాత్రలు చేసి సాహసం చేశారు. ఎవరూ చేయని పథకాలను ప్రవేశపెట్టారు. నాయకుడిగా, ప్రజల గుండెల్లో వెలిగిన ఒక మహానుభావుడు. NTR అంటే పేరు మాత్రమే కాదు. N అంటే నటన, T అంటే తారమండలం నుండి వచ్చిన ధ్రువ తారకుడు R అంటే రాజశ్రీ, రాజకీయ దురంధుడు, రారాజు. హీరోగా ఎన్నో పాత్రలు చేసి సక్సెస్ అయ్యారు. ఆయనకు అంత సక్సెస్ ఇచ్చిన ప్రజల కోసం ఒక తెలుగుదేశం పార్టీ స్థాపించారు. టాప్ హీరోగా ఉండగానే సినీ పరిశ్రమను వదిలేసి ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని ప్రజల్లోకి వచ్చారు. తెలుగు వారి రుణం తీర్చుకునేందుకు ఎన్టీఆర్ తెదేపా ను స్థాపించారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. ఆయన తీసుకొచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రతగా మారింది. మహిళలకు ఆస్తి హక్కు తదితర చరిత్రాత్మక నిర్ణయాలను ఆయన తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడిగా జన్మించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని బాలకృష్ణ అన్నారు.
నటుడిగా జానపధం, పౌరాణికం, సాంఘికం, చారిత్రకం.. ఇలా ప్రతి దానిలో ఆయనకి తిరుగు లేదని అనిపించుకున్నారు. కేవలం నటుడు గానే కాదు రైటర్గా, ఎడిటర్గా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు కళామతల్లికి ఎన్నో సేవలు అందించారు. నటుడిగా శిఖరాగ్ర స్థాయిని అందుకున్న ఎన్టీఆర్.. ఆయనికి అంతటి స్థాయిని అందించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ప్రజాసేవ చేయడానికి రాజకీయం వైపు అడుగులు వేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టి మొదటిసారి సీఎం అయ్యి.. రాజకీయ రంగంలో కూడా తనకి తిరుగులేదు అనిపించుకున్నారు. నేటికి(మే 28 2023) ఆయన పుట్టి 100 సంవత్సరాలు అవుతుంది.