తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) రాసే అభ్యర్థులకు మరోసారి హల్టికెట్లను జారీ చేయాలని అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 14,15 తేదీల్లోనే ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) నిర్వహించాల్సి ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురువడంతో ఎంసెట్ (అగ్రికల్చర్, మెడికల్) పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. అనంతరం ఈ పరీక్షకు సంబంధించి ఈనెల 30,31వ తేదీల్లో నిర్వహిస్తామని కొత్త తేదీలను ప్రకటించారు.
ఈ క్రమంలో ఈ పరీక్షకు సంబంధించి సుమారు 90 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష కేంద్రాలతోపాటు తేదీలు మారే అవకాశం ఉన్న కారణంగా మరోసారి విద్యార్థులకు కొత్త హల్టికెట్లను జారీ చేయాలని నిర్ణయించారు. మరోపక్క పరీక్ష సమయం దగ్గరపడుతుండడంతో విద్యార్థినీ, విద్యార్థులకు పరీక్షకు సన్నద్దం అవుతున్నారు. ఇటువంటి సమయంలో అధికారులు విద్యార్థులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కొత్త హాల్ టికెట్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.