భారత్-చైనా సరిహద్దులో 19 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియడంలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, వీరిలో ఒకరి మృతదేహం సమీపంలోని నదిలో లభ్యమైనట్లు కథనాలు వస్తున్నాయి. మిగిలిన వారు కూడా నదిలో కొట్టుకుపోయి ఉండొచ్చని అనధికారిక సమాచారం. వివరాలిలా.. అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో దమిన్ సర్కిల్లో సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ) రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది.
ఆ పనులు చేసేందుకు ఓ కాంట్రాక్టర్ 19 మంది కూలీలను అస్సాం నుంచి తీసుకొచ్చారు. అయితే, బక్రీద్ పండగ నిమిత్తం వీరు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సెలవు అడగ్గా.. కాంట్రాక్టర్ అందుకు అంగీకరించలేదు. దీంతో ఈ నెల 5వ తేదీన ఈ కూలీలంతా తమ శిబిరాల నుంచి పారిపోయారు. నాటి నుంచి వీరు కన్పించకుండా పోయినట్లు తెలుస్తోంది. రాజధాని ఇటానగర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖకు సమీపంలోనే కార్మికులు అదృశ్యమయ్యారు. అయితే కుమే నదిలో ఓ కార్మికుడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. పారిపోతున్న క్రమంలో కూలీలంతా ప్రమాదవశాత్తూ నదిలో పడిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యమైన కూలీలంతా అస్సాంలోని కొక్రాఝర్, ధుబ్రీ ప్రాంత వాసులుగా గుర్తించారు. వీరిని ఈ ఏడాది మేలోనే అరుణాచల్ప్రదేశ్కు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.