దిక్కులేక దిగొచ్చిన పాక్.. భారత్ మందులు కావాలంట..
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం భారత్తో ద్వైపాక్షిక, వాణిజ్య సంబంధాలను అన్నిస్థాయిల్లో తెంచుకున్న విషయం తెలిసిందే. ఆవేశంలో రకరకాల నిర్ణయాలు తీసుకుంది. బాలీవుడ్ సినిమాలను, సీరియళ్లను బ్యాన్ చేసింది. భారత్లో తయారైన వస్తువులను కొనుగోలు చేయొద్దని నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్లోని భారత దౌత్యాధికారిని కూడా బహిష్కరించింది. ఇంకా ముందు ముందు భారత్తో అసలు ఎలాంటి సంబంధాలు వద్దు అనే కఠిన నిర్ణయానికి కూడా వచ్చింది. కానీ, తానొకటి తలిస్తే పైవాడు ఒకటి తలిచాడు అన్నట్టైంది పాక్ పరిస్థితి. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను చూస్తే పాక్ నుంచి భారత్కు వచ్చే దిగుమతుల కన్నా.. భారత్ నుంచి పాక్కు అయ్యే దిగుమతులే ఎక్కువనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయింది పాక్.
అయితే పాకిస్తాన్లో ఇప్పుడు ప్రాణాంతక వ్యాధులు (పాముకాటు, రేబిస్) విజృంభించాయి. వాటికి తగిన మందులు లేవు. ఈ మందులను పాక్ ఇంతకుముందు భారత్ నుంచి దిగుమతి చేసుకునేది. వాణిజ్యంపై నిషేధంతో ఇన్ని రోజులుగా ఆ దేశంలో నిల్వ ఉన్న మందులు అయిపోయాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మందులు అందకపోతే చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశముంది. అక్కడి ప్రజలల దుస్థితి చూసి పాక్ ప్రభుత్వం చేతులు పిసుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెట్టు మాని మెట్టు దిగక తప్పడంలేదు.
పాకిస్తాన్ వాణిజ్య శాఖ భారత్ నుంచి ఔషధాలను దిగుమతి చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతి ఇచ్చిందని అక్కడి జియో న్యూస్ తెలిపింది. పిటిఐ నివేదిక ప్రకారం 2019 జులై వరకు పాకిస్తాన్ నుంచి భారత్కు 136 కోట్ల రూపాయల ఫార్మా ఆర్డర్ ఉంది. ఆర్టికల్ 370 రద్దుతో ద్వైపాక్షిక వాణిజ్యం రద్దు అయింది. దీంతో మందుల సరఫరా ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరి ఈ విషయంపై మోదీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.