కొత్తగా 11 దేశాలను పుట్టించిన పాక్ ప్రధాని
I commend the 58 countries that joined Pakistan in Human Rights Council on 10 Sept reinforcing demands of int community for India to stop use of force, lift siege, remove other restrictions, respect & protect Kashmiris' rights & resolve Kashmir dispute through UNSC resolutions.
— Imran Khan (@ImranKhanPTI) September 12, 2019
కశ్మీర్ అంశంలో అంతర్జాతీయంగా అబాసుపాలవుతున్నా పాకిస్తాన్ తీరు మార్చుకోవడం లేదు. తాజాగా మంగళవారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో కశ్మీర్ వ్యవహారంలో భారత్ నిర్ణయాన్ని 58 దేశాలు వ్యతిరేకించాయంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడం చర్చనీయాంశం అవుతోంది. 'ఇటీవల జెనీవాలో జరిగిన ఐరాస మానవ హక్కుల మండలి సమావేశంలో కశ్మీర్ ప్రజల పరిస్థితిని పాకిస్తాన్ లేవనెత్తగా 58 దేశాలు పాకిస్తాన్కు మద్దతు తెలిపాయి. కశ్మీరీలపై భారత ఆర్మీ నిర్బంధాన్ని ఎత్తివేయడంతో పాటు అక్కడ ప్రజలపై ఆంక్షలు నిలిపివేయాలని, వారి హక్కులను పరిరక్షించాలని మేం కోరాం. అలాగే, ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానాల ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించాం. ఆ సమయంలో 58 దేశాలు పాక్కే మద్దతు తెలిపాయి. కశ్మీర్ అంశంలో భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మా దేశం వైపు నిలిచిన దేశాలన్నింటికీ అభినందనలు' అని ఇమ్రాన్ ఖాన్ ట్వీట్ చేసారు.
అయితే ఇమ్రాన్ ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఐరాస మానవ హక్కుల మండలిలో మొత్తం 47 దేశాలు మాత్రమే ఉండగా ఇమ్రాన్ 58 దేశాలు అని ట్విటర్లో పేర్కొని నెటిజన్ల ఎదుట బుక్కయ్యారు. ఆయన చేసిన ట్వీట్పై నెటిజన్లు జోకులు వేస్తున్నారు. 'ఆ జాబితా మీ వద్ద ఉంటే పంపించండి..లేదంటే ప్రచురించండి. ఎవరిని వెర్రివాళ్లను చేయడానికి ఇదంతా?', 'పాక్లో ప్రతిఒక్కరూ సైంటిస్ట్లే.. కొత్తగా ఇమ్రాన్ఖాన్ 11 దేశాలను కనిపెట్టారు. పాక్ నాయకత్వానికి సెల్యూట్' అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.