పానీపూరి తిని 40 మంది చిన్నారులకు అస్వస్థత
పానీపూరి తిని 40 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆదిలాబాద్ జిల్లా సుందరయ్యనగర్ కాలనీలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారులంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారు తీసుకున్న ఆహారం పాడైపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం చిన్నారులందరికి చికిత్స అందిస్తున్నారు.
ఖుర్షీద్ నగర్ కాలనీల్లో ఓ వ్యక్తి పానీ పూరి అమ్ముతూ వచ్చాడు. లాక్డౌన్ కారణంగా చాలా రోజులుగా తినుబండారాలు రాకపోవడంతో చిన్నారులంతా ఎగబడ్డారు. రాత్రి 9 గంటల తర్వాత వాటిని తిన్నవారు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వెంటనే తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఇలా దాదాపు 40 మంది వరకు వైద్యం కోసం వచ్చారు. దీంతో ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. కాగా బాధితులంతా 5 నుంచి 10ఏళ్లలోపు చిన్నారులే ఉండటం విశేషం. తోపుడు బండిపై వచ్చిన వ్యక్తిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.