తమిళనాడు ప్రజలు తనలాంటి ప్రతిభావంతులను తమిళ ప్రజలు గుర్తించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. సోమవారం కోయంబత్తూరులోని పీళమేడు ప్రాంతంలో ప్రైవేటు కళాశాల(పీఎస్జీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్) ప్రాంగణంలో స్టాఫ్ డే కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన బీజేపీ నేతలను గవర్నర్లుగా ఎందుకు నియమిస్తున్నారనే అంశంపై మీడియా ప్రతినిధులతో అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. తన లాంటి ప్రతిభావంతులకు తమిళనాట గుర్తించకపోయినా కేంద్రప్రభుత్వం తమ సత్తాను తెలుసుకుని గవర్నర్(Governor) పదవినిచ్చిందని వ్యాఖ్యానించారు. మా ప్రతిభాపాటవాలు వృథా కాకూడదనే తలంపుతోనే కేంద్రప్రభుత్వం తమను గుర్తించి పదవులలో కూర్చోబెడుతోందన్నారు.
తనలాంటి వ్యక్తుల ప్రతిభను తమిళ ప్రజలు గుర్తించి ఉంటే ఈపాటికి ఎంపీలుగా గెలిచి కేంద్రమంత్రులుగా ఉండేవాళ్ళమని, పార్లమెంట్లో ప్రజా సమస్యలపై పోరాడి ఉండేవాళ్ళమని చెప్పారు. తమిళనాడుకు చెందిన ముగ్గురు బిజెపి నాయకులు, రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షులు లా గణేశన్, సిపి రాధాకృష్ణన్ మరియు డాక్టర్ తమిళిసైలు.. నాగాలాండ్, జార్ఖండ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు గవర్నర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు గురించి చెబుతూ గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా.. ఈ కార్యక్రమానికి రెండు సెల్ఫోన్లు చేతపట్టుకుని నడిచి వస్తుండగా ఓ పెద్దాయన రెండు సెల్ఫోన్లు ఎలా వాడుతున్నారని ప్రశ్నించారని, అందుకు తాను బదులిస్తూ రెండు రాష్ట్రాల పాలనా వ్యవహారాలను చూస్తున్న తనకు అదో లెక్కా అని చెప్పానని తమిళిసై అన్నారు. తాను 48 గంటలపాటు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల కోసం కష్టపడి సేవలందిస్తుంటే అవేవీ వార్తలుగా రావడం లేదని, అయితే ఆదివారం మహాబలిపురం(Mahabalipuram) కార్యక్రమంలో జారిపడితే వెంటనే ఆ ఘటన పెద్ద వార్తగా మారిందని తమిళిసై విమర్శించారు.