ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఘటనలో ఎవరి నిర్లక్ష్యం ఉన్నా, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కాగా, ఈ ఘటనలో ఇప్పటివరకు సీఐ హనీష్, ఎస్సై శ్రీనివాసరావులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. యువతి మూడ్రోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోగా, తల్లిదండ్రుల ఫిర్యాదు పట్ల పోలీసులు సరిగా స్పందించలేదన్న ఆరోపణలు వచ్చాయి. చివరికి బాధితురాలిని తల్లిదండ్రులే ప్రభుత్వాసుపత్రి వద్ద గుర్తించిన వైనం పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమంటూ తీవ్ర విమర్శలు రావడంతో జగన్ కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.