దేశంలోని రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కేంద్రం పలు పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఒకటి. 2019వ సంవత్సరంలో ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా ప్రారంభించిన ఈ పథకం ద్వారా కొన్ని మినహాయింపులకు లోబడి సాగు భూమి ఉన్న రైతు కుటుంబాలకు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ. 6,000 అందిస్తోంది. రూ. 2,000 చొప్పున మూడు విడతల్లో బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి.
తమ పేర్లపై సాగు భూమి ఉన్న రైతుల కుటుంబాలన్నీ ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులని కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 10 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఇప్పుడు 11వ విడత నిధులు జమ కానున్నాయి. పదో విడత జనవరి 1న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాగా, ఇప్పుడు 11వ విడత అందించనుంది. పీఎం కిసాన్ పథకం కింద ఈనెల 31వరకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది.