బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ప్రధాని మోదీ బయోపిక్ ‘నరేంద్ర మోదీ’ చిత్ర నిర్మాతకు బెదిరింపులు వచ్చాయి. ఆ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న అమిత్ బీ వాద్వానీ సోమవారం నాడు పోలీసులను ఆశ్రయించారు. తనను చంపుతామంటూ కొందరు సోషల్ మీడియాలో బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారని ఆయన సైబర్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆప్టిమిస్టిక్స్ అనే అకౌంట్ నుంచి బెదిరింపుల పోస్టులు పెడుతున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని పోస్టులో తన ఫోటోతో పాటూ తన కుమారుడి ఫోటోను కూడా షేర్ చేశారని తెలిపారు.
తాను మోదీ సినిమాను నిర్మించిడం పట్ల ఆ వ్యక్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడని వివరించారు. ‘నా కుటుంబాన్ని కూడా బూతులు తిడుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాధారణమే అయినప్పటికీ నా కుటుంబం ప్రస్తావన కూడా రావడంతో పోలీసులను ఆశ్రయించాను’ అని వివరించారు. కాగా, లాక్డౌన్ ఎత్తేసిన తరువాత విడుదల కాబోతున్న తొలి సినిమాగా మోదీ బయోపిక్ ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. లాక్డౌన్ అన్లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15న థియేటర్లు తెరుచుకుంటున్న సందర్భంగా ఈ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా, ఈ చిత్రం గత ఏడాది మే 24న విడుదల అయిన విషయం తెలిసిందే.