ఖమ్మం జిల్లా గ్రానైట్తో ఢిల్లో 28 అడుగుల నేతాజీ విగ్రహం
భారత స్వాతంత్య్రసంగ్రామంలో అద్వితీయపాత్ర పోషించిన నేతాజీ సుభాష్చంద్రబోస్ సేవలను తరతరాలకూ చాటిచెప్పేందుకు ఇండియాగేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని ఈ ఏడాది జనవరిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. నేతాజీ జయంతి (పరాక్రమ్ దివస్) సందర్భంగా జనవరి 23న ఇండియా గేట్ వద్ద నేతాజీ హోలోగ్రామ్ స్టాచ్యూను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. ఇప్పుడు అదే ప్లేస్ లో నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా గ్రానైట్ రాయితో తయారు చేసిన నేతాజీ విగ్రహాన్ని దేశరాజధాని నడిబొడ్డులో నిలబెట్టనున్నారు. గురువారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 28 అడుగుల ఎత్తులో ఈ విగ్రహానని తయారు చేశారు. విగ్రహం తయారీ కోసం ఢిల్లీకి 1,665 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి 140 చక్రాలుగల 100 అడుగుల లారీలో 280 మెట్రిక్ టన్నుల ఏకశిల గ్రానైట్ రాయిని తెప్పించారు. సుమారు 26వేల గంటలు శ్రమించి కళాకారులు 65 మెట్రిక్ టన్నుల బరువున్న 28 అడుగుల విగ్రహానికి ప్రాణం పోశారు. కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత యువ కళాకారుడు అరుణ్ యోగిరాజ్ ఆధ్వర్యంలో ఆధునిక పరికరాలు ఉపయోగించి పూర్తి భారతీయ సంప్రదాయపద్ధతిలో ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇది దేశంలోని ఎత్తైన ఏకశిలా విగ్రహాల్లో ఒకటి.