తెలంగాణలో పరువు హత్యల విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పోలీసులపై హైకోర్టు సీరియస్ అయింది. మెజారిటీ ప్రజల పక్షాన ఎందుకు నిలబడటం లేదని నిలదీసింది. స్వాతి-నరేశ్ కేసులో ఏమైనా అనుమానాలుంటే తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని నరేశ్ తల్లిదండ్రులకు హైకోర్టు సూచించింది.
సంచలనం రేపిన స్వాతి-నరేశ్ కేసులో తెలంగాణ పోలీసులు గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించారు. నరేష్ ఆచూకీ తెలుపాలంటూ అతని తల్లిదండ్రులు హెబియస్ కార్పస్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ ముగించిన హైకోర్టు..పోలీసులపై కన్నెర్ర చేసింది. తెలంగాణలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయని, ఈ విషయంలో పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పరువుహత్యల వ్యవహారంలో పోలీసులు మెజారిటీ ప్రజల పక్షాన ఎందుకు నిలబడటం లేదంటూ ప్రశ్నించింది.
స్వాతి-నరేశ్ కేసులో హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పోలీసులు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘నరేష్ను స్వాతి తండ్రి శ్రీనివాస్రెడ్డే చంపాడు. అతని హత్యకు సంబంధించిన ఆధారాలు లేకుండా నరేశ్ అస్థికలను మూసీ నదిలో కలిపాడు. ఆ తర్వాత స్వాతి ఆత్మహత్య చేసుకుంది. నరేష్ హత్యపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరుపుతున్నాం.నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకున్నాం. ఆత్మకూరు ఎస్సైను సస్పెండ్ చేశాం’ అని పోలీసులు ఈ నివేదికలో తెలిపారు.
tags High court on Police/Swathi naresh case/Court serious