నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నట్లు, నోటి శుభ్రత ఇప్పుడు మెదడు ఆరోగ్యాన్ని ప్రభావం చూపిస్తుందని ఒక అధ్యయనం చెబుతున్నది. అర్థం కాలేదు కదా.. ఇది మొత్తం చదివితే ఈ నోటికి మెదడుకి ఉన్నలింకేంటో అర్థమవుతుంది.
నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే రక్తంలో క్లాట్స్ ఏర్పడుతాయి. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక అధ్యయనం చెబుతున్నది. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం మెరుగైన మెదడు ఆరోగ్యానికి అవసరమని అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ నిర్వహించే ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2023లో సమర్పించనున్న అధ్యయనం వెల్లడించింది.
మన నోటిలో చిగుళ్లపై ఒక గారలాంటిది ఉంటుంది. దీన్నేసూప్రా జింజివల్ ప్లాక్ లేదా సబ్ జింజివల్ ప్లాక్ అంటారు. ఇది మన రక్తంలోని ప్లేట్ లెట్ లను గుంపులుగా చేరేలా చేస్తుంది. దాంతో రక్తం గడ్డకట్టే ప్రక్రియల్లో ఒకటైన ‘థ్రాంబస్ ఫార్మేషన్’ జరుగుతుంది. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. దీన్నే ‘థ్రాంబో ఎంబాలిజమ్’ అంటారు. ఈ ప్రక్రియ మెదడు రక్తాన్ని చెరవేసే రక్తనాళాల్లో జరిగినప్పుడు అది బ్రెయిన్ స్ట్రోక్ కు దారి తీయవచ్చు. అంతేకాదు.. మన నోటిలోని, ముఖ్యంగా కోరపళ్ల దగ్గరి ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి మెదడుకు పాకి కేవర్నస్ సైనస్ థ్రాంబోసిస్ అనే కండీషన్ కు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. పండ్లను శుభ్రంగా కడుక్కోవడమంటే మెదడునూ సురక్షితంగా ఉంచుకోవడమన్నమాట.
పరిశోధన..
హృద్రోగం, స్ట్రోక్ తరహాలోనే మెదడు ఆరోగ్యం కూడా జీవనశైలి, అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. దంతాలు, చిగుళ్లను శుభ్రంగా ఉంచుకోవడానికి మంచిదని పరిశోధకులు సూచిస్తున్నారు. 2014, 2021 మధ్య 4000 మంది పెద్దలపై నోటి పరిశుభ్రత, మెదడు ఆరోగ్యం మధ్య సంబంధం పై పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనంలో పాల్గొన్న వారికి ఎంఆర్ఐ ఇమేజ్ ల ద్వారా మెదడు ఆరోగ్యాన్ని ఆరా తీశారు. దంత సమస్యలు, చిగుళ్ల వ్యాధులు ఉన్న వారిలో మెదడుకు రక్తసరఫరాను నిరోధించే సైలెంట్ సెరిబ్రొవాస్క్యులర్ వ్యాధిని పరిశోధకులు గుర్తించారు.