జగన్ మోసాన్ని పైఎత్తుతో చిత్తు చేస్తాం.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణను మోసం చేశారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పోతిరెడ్డిపాడు వద్ద నీటి తరలింపు సామర్థ్యం పెంపు ప్రాజెక్టును ఎలా ఆపాలో తమకు తెలుసని.. ఏపీ ప్రభుత్వం ఎత్తుకు పైఎత్తు తాము వేస్తామని స్పష్టంచేశారు.
గురువాం శ్రీశైలం జలాల జగడంపై మంత్రి స్పందించారు. ‘జగన్ మమ్మల్ని మోసం చేశారు. జీవో జారీ చేసే ముందు సంప్రదించాల్సిం ఉండాల్సింది. విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు కడుతోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఏపీ జీవోతో కోతికి కొబ్బరిచిప్ప దొరికిన తీరుగా ప్రవర్తిస్తున్నాయి. తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్టులకు ఆనాడు కాంగ్రెస్ నాయకులు హారతులు పట్టారు. పోతిరెడ్డిపాడుకు సహకరించిందే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు’ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
పోతిరెడ్డిపాడు విషయంలో అప్పుడు కేబినెట్లో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరితోనూ కుమ్మక్కు కారని స్పష్టంచేశారు. తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్ ఊరుకోరని హెచ్చరించారు. కేసీఆర్ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారని.. ఇలాంటి విషయాల్లో పక్క రాష్ట్రాన్ని సంప్రదించాలన్న ఆలోచన ఏపీకి ఉండాలని హితవు పలికారు.