శవాన్ని కూడా వదల్లేదు.. అవయవాలను కాజేసిన ఆస్పత్రి  - Telugu News - Mic tv
mictv telugu

శవాన్ని కూడా వదల్లేదు.. అవయవాలను కాజేసిన ఆస్పత్రి 

May 7, 2020

కార్పోరేట్ ఆస్పత్రులకు వెళ్లామంటే చాలు బిల్లు తడిసి మోపెడు అవుతుంది. శవాన్ని సైతం పీక్కుతినేలా యాజమాన్యాల తీరు ఉంటుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఈ దోపిడి ఏ రీతిగా ఉందో అర్థం అవుతోంది. బ్రేయిన్ డెడ్‌తో చనిపోయిన వ్యక్తి నుంచి రూ. 1.70 లక్షల ఆస్పత్రి బిల్లుల కోసం అవయవాలను తీసుకున్నారు. విశాఖపట్నంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నాలుగేళ్ల క్రితం ఈ ఘటన జరిగింది. 

ఒడిశాలోని గంజాం జిల్లా జాగాపూర్‌ గ్రామానికి చెందిన కడియాల సహదేవ్‌ (32) 2016 డిసెంబరు 13 ఇచ్ఛాపురం వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.తలకు బలమైన గాయం కావడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఐదు రోజుల చికిత్స తర్వాత అతనికి బ్రెయిన్‌ డెడ్‌‌తో మరణించినట్టుగా తెలిపారు.  వైద్య బిల్లులు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని చెప్పారు. అంత డబ్బు లేకపోవడంతో అవయవాలు దానం చేస్తే డబ్బులు కట్టకుండా వెళ్లొచ్చని యాజమాన్యం సూచించింది. చేసేదేమి లేక అందుకు అతని తల్లిదండ్రులు అంగీకరించడంతో కిడ్నీలు,కాలెయం,కళ్లు సేకరించారుఈ విషయం అతని భార్యకు తెలియకుండానేే జరిగి పోయింది. ఆమె గర్భిణి కావడంతో ఆసుపత్రికి రాలేదు. భర్త అంత్యక్రియల తర్వాత బీమా డబ్బు కోసం దరఖాస్తు చేయగా దాన్ని తిరస్కరిస్తూ. అతని పోస్టు మార్టం రిపోర్టులో అవయవాలు లేవని తేలినట్టు వెల్లడించారు. 

దీంతో ఆమె జాతీయ మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది.. దీనిపై కమిషన్‌ ఆదేశాల మేరకు మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆసుపత్రి యాజమాన్యంపై ఏపీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ ఆర్గాన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. అవయవాల్ని దానం చేయాలంటే జీవిత భాగస్వామి సంతకం తప్పనిసరిగా ఉండాలి. కానీ ఆమె అనుమతి లేకుండా అవయవాలు తీసుకోవడంతో విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులు చనిపోయిన వ్యక్తి నుంచి కూడా బిల్లు కోసం ఈ విధంగా అవయవాలు తీసుకోవడం క్రూరమైన చర్య అంటూ పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి వారి పట్ల ప్రభుత్వాలు కఠినంగా వ్యహరించాలని డిమాండ్ చేస్తున్నారు.