అఖండ సినిమాతో ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. ప్రస్తుతం ఈ నటసింహం డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. గోపిచంద్ సినిమా తర్వాత బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఓ సినిమా చేయనున్నాడు.. ప్రస్తుతం ఈ సినిమా సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి.
ఈ సినిమాలో బాలకృష్ణ 50 ఏళ్ల వయసుగల తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఆయన కూతురు పాత్రలో శ్రీలీల నటించనుంది. ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా మెహరీన్ నటించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య సరసన నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి కనిపించనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో చిత్రయూనిట్ సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. కథా పరంగా బాలయ్య వయసుకి తగిన నాయిక ఆమే అని తీసుకున్నారట. ‘నారప్ప’ సినిమాలో ఆమె నటన కూడా ఈ సినిమాలోకి తీసుకోవడానికి కారణమైందని అంటున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటాయనీ, బాలయ్యను ఇంతవరకూ ఎవరూ చూపించని విధంగా తాను చూపిస్తానని అనిల్ రావిపూడి చెప్పడంతో అందరిలో మరింత ఆసక్తి రేకెత్తుతోంది.