ఆస్తిపన్నుపై 5 శాతం ఎర్లీబర్డ్ ప్రోత్సాహకాన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వార్షిక ఆదాయపు పన్ను పరిమితి రూ.30 వేలు ఉంటేనే ఈ ప్రోత్సాహకం వర్తింస్తుందని గతంలో పురపాలక శాఖ ప్రకటించింది. అయితే తాజాగా ఆ పరిమితిని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆస్తి పన్ను ఎంత ఉన్నా మే 31లోగా చెల్లిస్తే 5 శాతం రాయితీ వర్తించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయమై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ మాట్లాడుతూ.. ‘ఆస్తిపన్ను చెల్లింపునకు రేపు చివరిరోజు కావడంతో ఆదివారం సాయంత్రం వరకూ మీ-సేవా, సిటిజన్ సర్వీస్ సెంటర్లు పనిచేస్తాయి. నగరవాసులు ఈ ఎర్లీబర్డ్ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆన్లైన్ ద్వారా లేదా బిల్కలెక్టర్కు నేరుగా ఆస్తిపన్ను చెల్లించి రాయితీ పొందవచ్చు’ అని కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు.