రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధానికి సంబంధించి ఇప్పటికే పలు దేశాల అధ్యక్షులు ‘యుద్ధం ఆపండి – చర్చలు జరపండి’ అంటూ అటు రష్యా అధ్యక్షుడికి, ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలారోవ్.. ఉక్రెయిన్ సైన్యాలు ఆయుధాలు వదిలిపెడితే, యుద్ధం ఆపుతామని కీలక ప్రకటన చేశారు. తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కార్యాలయం నుంచి మరో కీలక ప్రకటన వెలువడింది.
ఈ ప్రకటనలో “ఉక్రెయిన్తో చర్చలకు మేము సిద్ధం. కానీ ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడాలి” అంటూ నిబంధన పెట్టింది. ఈ నిబంధనకు ఓకే అయితే, ఉక్రెయిన్తో చర్చలకు తమ బృందాన్ని మిన్స్క్కు పంపుతామని వెల్లడించింది. మధ్యాహ్నం విడుదలైన ప్రకటనకే ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకూ ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా వెలువడిన ఈ ప్రకటనకు ఉక్రెయిన్ నుంచి స్పందన వస్తుందా? చర్చలకు ఓకే అంటుందా? అనే చర్చ జోరుగా జరుగుతుంది.