ఊరు భయపడింది.. పసిబిడ్డను స్వయంగా ఖననం చేసిన అధికారి
రాక్షసంగా మనుషుల ప్రాణాలు హరిస్తున్న కరోనా కన్నా రాక్షసంగా తయారవుతున్నారు మనుషులు. కరోనాతో చనిపోయినవారిని శ్మశానంలో పూడ్చటానికి కూడా కొందరు అమానవీయులు అడ్డుకుంటున్న దారుణ ఘటనలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అలాంటి ఘటనే రాజస్థాన్లో పునరావృతం అయింది. నాలుగు నెలల శిశువు కరోనాతో చనిపోయాడని భావించిన చవాండీ గ్రామస్థులు అంత్యక్రియలకు నిరాకరించారు. ఈ విషయం తెలుసుకున్న భిల్వారా జిల్లాలోని ఓ సబ్ డివిజినల్ ఆఫీసర్(SDO) వారి పాపాన వారిని వదిలేసి.. ఆ చిన్నారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.
మృతిచెందిన శిశువు తండ్రికి ఇటీవలే కరోనా సోకినట్లు తేలింది. అయితే బుధవారం సాయంత్రం డయోరియా కారణంగా డీహైడ్రేషన్తో చిన్నారి చనిపోయింది. దీంతో చిన్నారి చావుకు కరోనానే కారణమని గ్రామస్థులు అనుమానించారు. ఆ బిడ్డ అంత్యక్రియలు నిర్వహించడకుండా అలాగే వదిలేశారు. గురువారం మధ్యాహ్నాం వరకు బిడ్డ శవం వద్దకు ఎవరూ వెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న కరేడా SDO మనిపాల్ సింగ్.. గురువారం మధ్యాహ్నాం బాధిత చిన్నారి ఇంటికి చేరుకున్నారు. ఆ చిన్నారికి కరోనా లేదని, నెగిటివ్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు నమ్మలేదు.
దీంతో విసుగెత్తిన ఆయన పసిబిడ్డను తన చేతుల్లో తీసుకున్నారు. పసిబిడ్డ మృతదేహాన్ని స్మశానవాటిక దగ్గరకు మోసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయమై మనిపాల్ సింగ్ మాట్లాడుతూ.. ‘మే 13న ముంబై నుంచి తమ స్వగ్రామమైన రాజస్థాన్లోని చావండి గ్రామానికి చెందిన బాధిత కుటుంబం వచ్చారు. వాళ్ల కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్ సెంటర్లో ఉంచి కరోనా పరీక్షలు నిర్వహించగా బాధిత చిన్నారి తండ్రి సురేష్ కుమావత్కు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయనను అధికారులు భిల్వారాలోని ఎంజీ ఆసుపత్రిలో చేర్చారు. మిగిలినవాళ్లను అధికారులు హోం క్వారంటైన్కు పంపారు. అయితే అప్పటికే డయేరియాతో బాధపడుతున్న చిన్నారి పరిస్థితి విషమించింది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే చిన్నారి మృతిచెందింది. అయితే వారు కరోనా హాట్ స్పాట్ ముంబై నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా చిన్నారికి కూడా కరోనా సోకి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానించారు. నేను బిడ్డను శ్మశానానికి తీసుకెళ్తుండగా చిన్నారి కటుంబ సభ్యుల్లో ఇద్దరు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారితో పాటు కొంతమంది గ్రామస్థులు కూడా వచ్చారు’ అని అన్నారు.