భార్య తోబుట్టువుపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అభం శుభం తెలియని తన చెల్లికి జరిగిన అన్యాయంతో ఆమె కోపం కట్టలు తెంచుకుంది. దీంతో కట్టుకున్నవాడని కూడా చూడకుండా అడ్డు తొలగించుకుంది. ఎవరికి తెలియకుండా అతన్ని ఇంటి వెనకాలే పూడ్చి పెట్టింది. జూన్ 2న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. రాజస్థాన్ లోని సికార్ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా ఆశ్చర్యపోయే నిజాలు బయటకు వచ్చాయి.
తొమ్మిది నెలల గర్భిణీగా ఉన్న నిందితురాలు తనకు సహాయంగా 8 వతరగతి చదువుతున్న చెల్లెలిని ఇంటికి తీసుకువచ్చింది. అప్పటికే మరో ఐదేళ్ల బిడ్డ కూడా ఉండటంతో బాలిక ఇద్దరి బాగోగులు చూసేది. ఈ క్రమంలో భార్య చెల్లెలిపై భర్త కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించి ఓ రోజు అత్యాచారానికి ఒడిగట్టాడు. చెల్లి కేకలు విని వచ్చిన ఆమె వదలిపెట్టమంటూ బతిమిలాడింది. అయినా కూడా కామంతో కళ్లుమూసుకుపోయిన అతడు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకొని ఓ ఇనుపరాడ్డు తీసుకొని తలపై బలంగా కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడు రక్తపు మడుగులో మరణించాడు. ఆ తరువాత భర్త మృతదేహాన్ని లాక్కెళ్లి ఇంటి పెరటిలో పాతిపెట్టింది. ఎలాగైనా కేసు తప్పదని భావించి చివరకు లొంగిపోయింది.