ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్. నెల రోజులపాటు కఠిన నియమాలతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటూ ఆఖరి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 3 నుండి మే 2 సాయంత్రం వరకు పవిత్ర రంజాన్ మాసం జరుపుకుంటున్నారు. మంగళవారం ప్రత్యేక ప్రార్ధనలతో పండుగ జరుపుకోనున్నారు ముస్లిం సోదరులు. పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా చార్మినార్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
పండుగ సందర్భంగా నగరంలోని మసీదులు , దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు హైదరాబాద్ పోలీసులు. మంగళవారం ఉదయం 7 నుంచి 11:30 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.
ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
1.మెహిదీపట్నం నుంచి బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1 వైపు వచ్చే వాహనాలు అయోధ్య, ఖైరతాబాద్, ఆర్టీఏ ఆఫీస్, తాజ్కృష్ణా మీదుగా వెళ్లాలి.
2.బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి మాసబ్ట్యాంక్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను తాజ్కృష్ణా, ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.
3.లక్టీకాపూల్ నుంచి రోడ్ నంబర్ 1/12 వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు అయోధ్య, నిరంకారి, చింతల్బస్తీ మీదుగా వెళ్లాలి.
4. శివరాంపల్లి, నేషనల్ పోలీసు అకాడమీ వైపు నుంచి బహదూర్పురా వచ్చే వాహనాలను ధనమ్మ గుడిసెలు ఉండే టీ-జంక్షన్ నుంచి ఆలియాబాద్, తాడ్బండ్, బాయిస్ టౌన్ హైస్కూల్ మీదుగా వెళ్లాలి.
ఈదుల్ ఫితర్ సందర్భంగా మీరాలం ట్యాంక్ ఈద్గా వద్ద, మాసాబ్ ట్యాంక్ హాకీ స్టేడియం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ప్రార్థనల కోసం వచ్చే వాహనాలు పురానాపూల్, కిషన్ బాగ్, బహదూర్ పురా చౌరస్తా మీదుగా వెళ్లాలని పోలీసులు తెలిపారు. కాగా, రంజాన్ సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.