నగరి వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో రెండో విడత మంత్రివర్గ ఏర్పాటు నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఖాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి జబర్దస్త్ షోతో పాటు ఇతరత్రా షూటింగులలో పాల్గొనని స్పష్టం చేశారు. మంత్రిగా పూర్తి సమయాన్ని తన శాఖకు కేటాయించాల్సి వస్తుందనీ, ఈ క్రమంలో షూటింగులకు సమయాన్ని కేటాయించలేనని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ.. సమర్ధవంతంగా ప్రజలకు సేవ చేస్తానని ప్రకటించారు. ఇదిలా ఉండగా, గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ నటుడు బాలయ్యకు మంత్రి పదవి ఆఫరిస్తే.. మంత్రి పదవి వల్ల సినిమాలకు దూరం కావాల్సి వస్తుంది కాబట్టి మంత్రి పదవి నాకొద్దు అని బాలయ్య బాబు నిర్ణయించుకున్నారు. మంత్రి పదవుల్లో ఉండేవారు ఇతరత్రా ఆదాయం వచ్చే వృత్తులలో ఉండకూడదనే నియమానికి కట్టుబడి ఉండాలి. ఈ నేపథ్యంలో రోజా గారు షూటింగులకు దూరమయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, తన గెలుపులో జబర్దస్త్ కార్యక్రమం తన వంతు పాత్ర పోషించిందని రోజా గారు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.